: రాజీవ్ అందగాడు కనుకే సోనియా ఆయనను పెళ్లి చేసుకున్నారట...పాకిస్థాన్ నేత రాసిన పుస్తకంలో వెల్లడి!

దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని అందగాడు కనుకే సోనియా గాంధీ పెళ్లి చేసుకున్నారని పాకిస్థాన్ మాజీ విదేశాంగ శాఖ మంత్రి ఖుర్షీద్ కసూరి తన పుస్తకంలో పేర్కొన్నారు. 'నైదర్ ఏ హాక్ నార్ ఏ డోవ్' అనే పుస్తకంలో కసూరి ఈ విషయాలను ప్రస్తావించారు. 2005లో అప్పటి పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్, భారత్ ను సందర్శించారు. ముషారఫ్ తో జరిగిన సమావేశానికి నాటి భారత విదేశాంగ శాఖ మంత్రి నట్వర్ సింగ్ వెంట సోనియా కూడా హాజరయ్యారు. వెయిటింగ్ హాల్లో ఉన్న సోనియాగాంధీని కలసిన సందర్భాన్ని, ఆమెతో సరదాగా కాసేపు మాట్లాడిన విషయాలను ఆ పుస్తకంలో కసూరి గుర్తు చేశారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో తాను చదువుకున్న రోజుల్లో జరిగిన ఒక సంఘటనను ఆయన ప్రధానంగా పేర్కొన్నారు. ఆ సంఘటన వివరాలు.. ఇఫ్తికార్ ఉద్దీన్ (గాంధీ, నెహ్రూల స్నేహితుడు, కాంగ్రెస్ నేత) కుమారుడు సోహాలి ఇఫ్తికార్ తో కలసి సరదాగా మాట్లాడుతూ నడుచుకుంటు వెళ్తుండగా... కింగ్ పరేడ్ కు ఆపోజిట్ డైరెక్షన్ లో అందంగా ఉన్న ఒక యువకుడు నడుచుకుంటూ వస్తున్నాడు. వెంటనే, సోహాలీని అడిగాను.. ఆ కుర్రాడు ఎవరని.. అతని పేరు రాజీవ్ గాంధీ అని, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మనవడని చెప్పాడు. ఇదే విషయాన్ని నాడు వెయిటింగ్ హాల్ లో సోనియాకు చెబితే... రాజీవ్ అందగాడు కనుకనే నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పి నవ్వారని ఖుర్షీద్ తన పుస్తకంలో రాసుకున్నారు.

More Telugu News