: ‘రిషితేశ్వరి’ నిందితుల రిమాండ్ పొడిగింపు... బెయిల్ పిటిషన్ విచారణ 31కి వాయిదా

తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనకు సంబంధించి అరెస్టైన నిందితుల రిమాండ్ ను వచ్చే నెల 11 దాకా పొడిగిస్తూ గుంటూరు కోర్టు నిర్ణయం తీసుకుంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బీఆర్క్ విద్యనభ్యసిస్తున్న రిషితేశ్వరిపై సీనియర్లు వేధింపులకు దిగారు. దీనిపై రిషితేశ్వరి తండ్రి చేసిన ఫిర్యాదుకు ప్రిన్సిపాల్ బాబూరావు స్పందించలేదు. ఈ నేపథ్యంలో సీనియర్లు మరింత రెచ్చిపోయి రిషితేశ్వరిపై లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డారు. వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన రిషితేశ్వరి వర్సిటీ హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆమెపై వేధింపులకు పాల్పడిన ముగ్గురు సీనియర్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను నేటి ఉదయం విచారించిన గుంటూరు కోర్టు తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. అంతేకాక నిందితుల రిమాండ్ ను వచ్చే నెల 11 వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.

More Telugu News