: సమాజానికి ఎంతో కొంత ఇచ్చేద్దాం!: అభిమానులకు మహేష్ బాబు పిలుపు

మనకు ఎంతో ఇచ్చిన సమాజానికి ఎంతో కొంత ఇచ్చేద్దామని, లేకపోతే లావైపోతామని సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు పిలుపునిచ్చాడు. 'శ్రీమంతుడు' సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, ఈ సినిమాలో మంచి సందేశం ఉందని అన్నాడు. కథ నచ్చింది కనుకే ఈ సినిమా చేశానని, తన నమ్మకం నిజమవుతుందని మహేష్ విశ్వాసం వ్యక్తం చేశాడు. కొరటాల శివ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దాడని మహేష్ బాబు దర్శకుడ్ని ప్రశంసించాడు. ఈ సినిమా కథను 40 నిమిషాలపాటు చెప్పాడని, అప్పుడే 'మనం ఈ సినిమా చేస్తున్నాం' అని అతనికి చెప్పానని, ఇందులోని పాయింట్ ఎవరినైనా ఆకట్టుకుంటుందని మహేష్ తెలిపాడు. సినిమాలో తన తండ్రి పాత్రకు జగపతిబాబును తానే సూచించానని, జగపతిబాబు తమవరకు ఇప్పుడు కూడా హీరోయేనని అన్నాడు. ఇంత పెద్ద తారాగణంతో సినిమాను అద్భుతంగా రూపొందించిన దర్శకుడిని, అతనికి సహకరించిన నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపాడు. సినిమాలో పాటలకు దేవీశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించాడని, 'జాగో' పాట తనను ఆకట్టుకుందని టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు చెప్పాడు.

More Telugu News