: రిషితేశ్వరి ఘటనలో మరో విద్యార్థికీ ప్రమేయముందట... పోలీసుల నిర్ధారణ

గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఘటనలో దర్యాప్తు చేస్తున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. సీనియర్ల వేధింపుల కారణంగానే రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుందన్న విషయాన్ని నిర్ధారించుకున్న పోలీసులు ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా ఈ ఘటనలో మరో విద్యార్థికి కూడా ప్రమేయముందని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం సదరు విద్యార్థి కోసం పోలీసులు వేట మొదలెట్టారు. ఇక రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిన రోజు రాత్రి నిందితులతో కలిసి ఆమె మంగళగిరిలోని థియేటర్ కు సినిమాకు వెళ్లినట్లు ఇదివరకు పోలీసులు చెప్పారు. అయితే విజయవాడలోని మల్టీప్లెక్స్ థియేటర్ కు వారంతా సినిమాకు వెళ్లారని తాజాగా పోలీసులు గుర్తించారు. సినిమా చూసిన అనంతరం రాత్రి 11 గంటలకు హాస్టల్ కు చేరుకున్న రిషితేశ్వరి భోజనం చేసి పడుకుందట. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది. అయితే విజయవాడ మల్టీప్లెక్స్, ఆ తర్వాత హాస్టల్ లో ఏం జరిగిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

More Telugu News