: వాట్స్ యాప్ కొత్త వర్షన్లోని సరికొత్త ఫీచర్లు ఇవే!

పలు సరికొత్త ఫీచర్లతో నిండిన వాట్స్ యాప్ లేటెస్టు వర్షన్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. 'మార్క్ యాజ్ అన్ రీడ్', 'కస్టమ్ నోటిఫికేషన్స్' వంటి ఫీచర్లు వాట్స్ యాప్ కు వచ్చి చేరాయి. ఇప్పుడున్న వీ2.12.189 వర్షన్ నుంచి స్మార్ట్ ఫోన్ యూజర్లు వీ2.12.194కు అప్ డేట్ అయితే, ఈ కొత్త ఫీచర్లు వాడుకోవచ్చని సంస్థ తెలిపింది. ఓ గ్రూప్ లేదా వ్యక్తుల కాంటాక్టులను తమకు నచ్చినట్టుగా మేనేజ్ చేసుకోవచ్చని, ఇందుకోసం మీడియా బాక్స్ కింద గ్రూప్ డీటెయిల్స్ పేజీలోకి వెళ్లి సెట్టింగ్స్ మార్చుకోవాల్సి వుంటుందని వివరించింది. ఇందులో భాగంగా 'మ్యూట్ చాట్', 'టోన్స్', 'వైబ్రేషన్ లెంగ్త్', 'పాపప్ నోటిఫికేషన్స్' తదితరాలను సెట్ చేసుకోవచ్చని పేర్కొంది. వీటితో పాటు యూజర్లు ఎంతో కాలంగా అడుగుతున్న 'అన్ రీడ్' ఆప్షన్ ను కూడా అందిస్తున్నట్టు తెలిపింది. ఓ నోటిఫికేషన్ లేదా చాట్ మెసేజ్ పై వేలిని అదిమిపెట్టడం ద్వారా అన్ రీడ్ ఫీచరును పొందవచ్చని, అయితే, ఇది మెసేజ్ పంపిన వారి స్టేటస్ కు వర్తించదని వివరించింది. వీటితో పాటు తాజా వర్షన్ ద్వారా తక్కువ డేటా ఖర్చవుతుందని, వాయిస్ కాల్స్ కు కూడా సాధారణ పరిస్థితులతో పోలిస్తే తక్కువ డేటా తీసుకుంటుందని, గూగుల్ డ్రైవ్ ఆప్షన్ ను తిరిగి అందిస్తున్నామని తెలిపింది.

More Telugu News