: కేరళలో గ్రామ సింహాల జోరు.... అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన సీఎం

దేశంలోని ప్రధాన సమస్యల్లో వీధి కుక్కల అంశం ఒకటి. ప్రజలు నిత్యం ఈ గ్రామ సింహాల బారిన పడుతూనే ఉన్నారు. కేరళలో ఈ సమస్య తీవ్రం కావడంతో సీఎం ఊమెన్ చాందీ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ గురువారం నాడు అఖిలపక్షం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ అంశాన్ని సభలో ప్రభుత్వ చీఫ్ విప్ థామస్ ఉన్నియదన్ ప్రస్తావించగా, ముఖ్యమంత్రి బదులిచ్చారు. గతేడాది దాదాపు 90,000 మంది కుక్క కాటుకు గురైనట్టు నివేదికలు చెబుతున్నాయని ఉన్నియదన్ తెలిపారు. వీధి కుక్కలను చంపరాదని చట్టాలు చెబుతున్నాయని కొందరు జంతు ప్రేమికులు అంటున్నారని, అందులో వాస్తవం లేదని అన్నారు. ఈ జంతు ప్రేమికులు మనుషుల ఫ్రాణాల కంటే వీధి కుక్కల ప్రాణాలకే విలువ ఇస్తున్నారని ఆయన విమర్శించారు. అటుపై చాందీ మాట్లాడుతూ.... వీధి కుక్కల బెడద రూపుమాపేందుకు నియమావళి ఉందని, దీనికి సంబంధించి కేరళ హైకోర్టు 2006లో ఆదేశాలిచ్చిందని వివరించారు. ప్రజల రక్షణ తమకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.

More Telugu News