: సండ్ర అరెస్ట్ ముమ్మాటికీ దళితులపై దాడే!: టీడీపీ నేత జూపూడి

ఓటుకు నోటు అంశంలో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను అరెస్ట్ చేయడం ముమ్మాటికీ దళితులపై జరుగుతున్న దాడే అని ఆ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో సండ్ర అరెస్ట్ ను ఆయన తీవ్రంగా ఖండించారు. విచారణకు సండ్ర పూర్తిగా సహకరిస్తున్నప్పటికీ... అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏసీబీకి ఏమొచ్చిందని ప్రశ్నించారు. టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా దళిత వ్యతిరేకి అని... టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ చివరకు తానే సీఎం పీఠాన్ని అధిష్టించారని... డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యను పదవి నుంచి తొలగించారని... ఇప్పుడు దళితుడైన సండ్రను అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. టీఆర్ఎస్ లో చేరాలని గతంలో సండ్రను ఒత్తిడి చేశారని... దానికి ఆయన అంగీకరించకపోవడంతో ఇప్పుడు అరెస్ట్ చేశారని ఆరోపించారు. కేసీఆర్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు.

More Telugu News