: ఇకపై 'ఫేస్ బుక్'లో మీరెక్కడున్నా పట్టేస్తుంది!

సోషల్ మీడియా యువతరాన్ని ఊపేస్తోంది. ఈవేళ ఫేస్ బుక్ లేదా ట్విట్టర్లో అకౌంట్ లేని వాళ్లు తక్కువ మంది వుంటారంటే అతిశయోక్తి కాదు. ఒక వైపు సామాజిక మాధ్యమాల వినియోగం పెరుగుతుండడానికి తోడు నకిలీ అకౌంట్లు కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఓ సరికొత్త సౌకర్యాన్ని ఫేస్ బుక్ అందుబాటులోకి తేనుంది. ఇకపై ఫేస్ బుక్ వినియోగించే వారు ఓసారి తమ ఫోటోను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేస్తే చాలు, తరువాత ఆ వ్యక్తికి సంబంధించిన మరేవైనా ఫోటోలు ఫేస్ బుక్ లో ఎక్కడున్నా పసిగట్టేసే సాంకేతికత అందుబాటులోకి రానుంది. దీనిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ లో చేసిన పరిశోధనలు ఉత్తమ ఫలితాలిచ్చాయని ఫేస్ బుక్ వెల్లడించింది. వీటి ఆధారంగా ఫేస్ బుక్ శాస్త్రవేత్తలు సరికొత్త ఆల్గారిధమ్ రూపొందించారు. దీని ఆధారంగా అస్పష్టంగా ఉన్న 40,000 ఫోటోలపై పరిశోధన చేశారు. కేవలం అస్పష్టంగా ఉన్న ఫోటోలను గుర్తించడమే కాకుండా, వెనక్కు, పక్కకు తిరిగి ఉన్నా, వంగి ఉన్నా ఫోటోలోని వ్యక్తులను ఫేస్ బుక్ సౌకర్యం స్పష్టంగా పట్టేసిందని వారు వెల్లడించారు. 83 శాతం కచ్చితత్వంతో ఇది పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

More Telugu News