: వింటేనే గుండెపోటు!... 25 వేల రూపాయల 'స్టెంట్'ను లక్షా 55 వేలకు అమ్ముతున్నారు!

కేవలం రూ. 25 వేలు చెల్లించి దిగుమతి చేసుకుంటున్న 'స్టెంట్'లను రూ. 1.55 లక్షల రూపాయలకు అమ్ముతున్నారు. వింటేనే గుండెపోటు తెప్పించే ఈ విషయాన్ని భారత ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డీఏ) నిర్వహించిన తొలి కాస్ట్ సర్వేలో వెల్లడించింది. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాలు పూడుకుపోయినప్పుడు ఈ స్టెంట్ లను వాడతారన్న సంగతి తెలిసిందే. మొత్తం ఆరు నెలల పాటు ధరలను పరిశీలించిన ఎఫ్ డీఏ 'స్టెంట్స్' వ్యాపారంలో ఉన్న ఓ మల్టీ నేషనల్ కంపెనీ కార్యకలాపాలను ట్రాక్ చేసింది. పశ్చిమ దేశాల నుంచి 'స్టెంట్స్' ఇంపోర్ట్ చేసుకుని డిస్ట్రిబ్యూటర్లకు విక్రయిస్తున్న సంస్థ నియంత్రణ లేని లాభాలను అందుకుంటోందని, ఈ సంస్థకు ఒక్కో స్టెంట్ పై 120 శాతం లాభం వస్తోందని తేల్చింది. మరో మూడు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలనూ పరిశీలించిన ఎఫ్ డీఏ, వీరు సరాసరిన 125 శాతం వరకూ లాభాలను సంపాదిస్తున్నారని పేర్కొంది. కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు ఆసుపత్రులకు సైతం లాభాల్లో వాటాలందుతున్నాయని తెలిపింది. గుండె జబ్బు రోగులకు సత్వర చికిత్స అత్యవసరం కావడంతో మరో మార్గం లేక అడిగినంత ధర పెట్టి వీటిని కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వివరించింది.

More Telugu News