: తుళ్లూరులో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు సన్మానం

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో టీడీపీ 34వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు రాష్ట్ర మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముందు పార్టీ జెండాను సీఎం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, తెలుగు జాతి కోసం పనిచేస్తున్న పార్టీ టీడీపీ ఒక్కటేనన్నారు. రాజకీయాలకు ఎన్టీఆర్ కొత్త నిర్వచనం చెప్పారని పేర్కొన్నారు. ఆయన వ్యక్తి కాదని... ఓ వ్యవస్థ, యుగపురుషుడని బాబు కీర్తించారు. టీడీపీని దెబ్బతీయాలని ఎంతో మంది కుట్రలు పన్నారని, అయినా చివరికి వారే దెబ్బతినిపోయారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు నాలుగు సంవత్సరాలు పడుతుందని, పట్టిసీమను సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతోనే పట్టిసీమకు శ్రీకారం చుట్టామని సీఎం వివరించారు. ఈ కార్యక్రమం చివరలో ఎంపిక చేసిన పార్టీ కార్యకర్తలను చంద్రబాబు సన్మానించనున్నారు.

More Telugu News