: మెల్బోర్న్ మైదానంలో మన సమోసాలు... ధర మాత్రం పేలిపోయింది!

"సమోసాలు... సమోసాలో..." అంటూ మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో స్నాక్స్ అమ్మకందారులు కలయ తిరుగుతుంటే అది ఆస్ట్రేలియానా లేక ఇండియాలోని ఏదో క్రికెట్ మైదానంలో కూర్చున్నామా? అనిపించింది క్రీడాభిమానులకు. నిన్న ఇండియా, బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో భారతీయులకు, బంగ్లావాసులకు ఇష్టమైన ఆహార పదార్థాలలో ఒకటైన సమోసాల అమ్మకం జోరుగా సాగింది. ఈ మ్యాచ్ చూడటానికి ఉపఖండం నుంచి భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని ముందే ఊహించిన మెల్బోర్న్ స్టేడియం నిర్వాహకులు సమోసాలను మెనూలో చేర్చారు. ఇలా ఒక భారతీయ వంటకాన్ని మెల్బోర్న్ స్టేడియం మెనూలో చేర్చడం ఇదే తొలిసారట. అయితే, ధర మాత్రం చాలా ఎక్కువండోయ్. ఎంతో తెలుసా? రెండు సమోసాలు 5.60 ఆస్ట్రేలియన్ డాలర్లు మాత్రమే. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 250 అన్నమాట. క్రికెట్ మైదానంలో చికెన్ హాట్ డాగ్, చికెన్ బర్గర్ల ధర కూడా ఇంతేనట. ఏదిఏమైనా మన సమోసా చాలా హాట్ గురూ!

More Telugu News