: రోబోల తయారీలో భారత్ ముందడుగు... రంగంలోకి దిగిన టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్!

తదుపరి దశ అభివృద్ధిపై కన్నేసిన ఐటీ దిగ్గజాలు రోబోటిక్స్ వైపు దృష్టిని సారించాయి. ఇందులో భాగంగా డ్రైవర్ రహిత కారు తయారీ దిశగా అడుగులు వేస్తున్నాయి. భారత ఐటీ కీర్తి పతాకాన్ని ప్రపంచం నలుచెరగులా ఎగురవేసిన టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీలు ప్రస్తుతం సరికొత్త, అత్యాధునిక సాంకేతికత వైపు పరుగులు పెడుతున్నాయి. పరుగు పోటీలో ఎవరు ముందు లక్ష్యాన్ని చేరితే వారు గెలిచినట్టన్నట్టు తమ వద్ద ఉన్న మిగులు నిధులను వెచ్చిస్తూ, ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే, ఈ వారం మొదట్లో అమెరికా సంస్థ పనయాను ఇన్ఫోసిస్ కొనుగోలు చేసింది. మానవులు నిర్ణయాలు తీసుకునే విధానాన్ని అనుసరించేలా కంప్యూటింగ్ వ్యవస్థ తయారీలో విప్రో భారీ పెట్టుబడులు పెట్టింది. హార్డ్ వేర్ యంత్రాలను పరీక్షించే రోబోల తయారీకి హెచ్సీఎల్ నడుం బిగించింది. సమీప భవిష్యత్తులో ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు విభాగాల్లో పెట్టుబడులు, రీసెర్చ్ 25 నుంచి 30 శాతం మేరకు వృద్ధి చెందుతుందన్న అంచనాల నేపథ్యంలో తమవంతు వాటా కోసం ఈ కంపెనీలు దూసుకెళ్తున్నాయి. "కొత్త తరం సాఫ్ట్ వేర్ దిశగా కదులుతున్న ప్రస్తుత తరుణంలో ఐటీ సేవల కంపెనీలకు ఇంతకన్నా మరోమార్గం లేదని రీసెర్చ్ నిపుణులు వ్యాఖ్యానించారు. అయితే ఈ తరహా వినూత్న సాంకేతికత అభివృద్ది చేయడానికి ఎంతో వ్యయ ప్రయాసలు అవసరం. ఈ దిశగా ఏ కంపెనీ తన లక్ష్యాన్ని చేరుకుంటుందో కాలమే నిర్ణయిస్తుంది.

More Telugu News